రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో వితరణ
హైదరాబాద్:
బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ‘రెడీ టూ సర్వ్ ఫౌండేషన్’, ‘అమ్మ హెల్పింగ్ హాండ్స్’ సేవా సంస్థల ఉమ్మడి నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి ఉచితంగా పోషకాహారాన్ని అందించారు. ఆసుపత్రికి చికిత్స నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులు, వారి సహాయకులు ఆహారం లేక పడే అవస్థలను గుర్తించి ఈ దిశగా అడుగులు వేశారు.
*స్వచ్ఛంద సేవకుల విశేష స్పందన
ఈ అన్నదాన మహాయజ్ఞంలో పలువురు స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా వడ్డన ప్రక్రియలో భాగస్వాములై వందలాది మందికి ఆప్యాయంగా భోజనం అందించారు. సమాజంలో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే తమ ప్రాథమిక లక్ష్యమని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలను నగర వ్యాప్తంగా ఉన్న మరిన్ని ప్రధాన ఆసుపత్రుల వద్దకు విస్తరిస్తామని వెల్లడించారు.
*లబ్ధిదారుల ఆనందం – నిర్వాహకులకు అభినందనలు
రోజంతా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, భోజన వసతి లేక నిరీక్షించే నిరుపేదలకు ఈ అన్నదానం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలో తమకు ఆకలి బాధ తప్పించిన సేవా సంస్థల ప్రతినిధులను, స్వచ్ఛంద సేవకులను పలువురు ప్రశంసించారు.
*”సమాజ సేవలో భాగస్వాములు కాండి” “సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న దాతలు, స్వచ్ఛంద సేవకులు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. అందరి భాగస్వామ్యంతోనే అవసరంలో ఉన్న మరిన్ని కుటుంబాలకు సేవలు అందించడం సాధ్యమవుతుంది.”
*— పెద్ది శంకర్, ఫౌండేషన్ నిర్వాహకులు


